పోలీసు ఉన్నతాధికారులతో సీఎం శివరాజ్ సింగ్ భేటీ

పోలీసు ఉన్నతాధికారులతో సీఎం శివరాజ్ సింగ్ భేటీ

భోపాల్: ఖార్గోన్, బర్వాణీ సంఘటనలపై మంగళవారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖార్గోన్, బర్వాణీ సంఘటనలకు గల కారణాలు, అనంతరం జరిగిన పరిణామాల గురించి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ఖార్గోన్, బర్వాణీ ప్రాంతాల్లో ఆదివారం వేర్వేరుగా జరిగిన శ్రీ రామనవమి ఊరేగింపు వేడుకల్లో కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడంతో పోలీసులతో పాటు పలువురు గాయపడిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్ గా తీసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసింది. అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారనే ఆరోపణలతో దాడికి పాల్పడిన 45 మంది ఇళ్లు, దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేసింది.